వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ , నన్ను ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించడం ఆనందంగా ఉంది… నేను న్యాయపోరాటం చేశాను న్యాయమే గెలిచింది… కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు, న్యాయస్థానానికి కృతజ్ఞతలు … బుధవారం స్పీకర్ ను కలిసి రిక్వెస్ట్ లెటర్ అందజేస్తాను… ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముందుగా జరగాల్సిన ప్రొసీజర్ జరుగుతుంది… వనమా వెంకటేశ్వరరావు పట్ల కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను… ఈ నేరం కింద ఆయనకు జైలు శిక్ష పడే అవకాశాల మీద కూడా న్యాయపరంగా ఉన్న అవకాశాలను వినియోగించుకుంటాను… అంటూ ఎమ్మెల్యేగా ప్రకటింపబడిన జలగం వెంకటరావు తన అభిప్రాయాలను తెలియజేశారు… కోర్టు తీర్పు సందర్భంగా ఆయన ఫోన్లో ఐకాన్ న్యూస్ తో మాట్లాడారు…
…. తీర్పుపై జలగం అభిప్రాయాలు ఆయన మాటల్లోనే…
ప్రశ్న : హైకోర్టు తీర్పు పట్ల , మీ అభిప్రాయం..?
జవాబు : హైకోర్టు తీర్పు నాకు ఆనందం కలిగించింది, వనమా వెంకటేశ్వరరావు ఆస్తులు వివరాలు తప్పుగా చూపారని పిటిషన్ వేశాను…
అది నిజమని రుజువు అయింది న్యాయం గెలిచింది…
ప్రశ్న: మీరు ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకుంటారా, లేక వనమాను జైలుకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తారా..?
జవాబు: ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకునెందుకు బుధవారం రిక్వెస్ట్ లెటర్ ఇస్తాను , ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారానికి ముందు జరగాల్సిన ప్రొసీజర్ అంతా జరుగుతుంది…
వనమా వెంకటేశ్వరరావు ను జైలుకు పంపే అవకాశాలపై కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు నాకు చట్ట పరిధిలో వెసులుబాటు ఉంది..
ప్రశ్న: హైకోర్టు తీర్పుతో మీరు సంతృప్తి చెందడం లేదా..?
జవాబు : ఈ తీర్పు పట్ల ఆనందమే, కానీ ఇటువంటి కేసుల్లో జరిమానాతో సరిపెట్టడమే కాకుండా జైలు శిక్ష పడే అవకాశాలపై కూడా ప్రయత్నాలు చేసే అవకాశం చట్టపరంగా నాకుంది. ఆయా అవకాశాలను వినియోగించుకుంటాను …
అన్ని విధాలుగా తోడ్పాటు అందించిన నా కొత్త గూడెం నియోజకవర్గ ప్రజలకు, న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. అంటూ జలగం వెంకట్రావు తన అభిప్రాయాలను తెలియజేశారు..
…. కోర్టు తీర్పుతో మారిన కొత్తగూడెం రాజకీయాలు…
కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ జలగం వెంకట్రావును కొత్తగూడెం శాసనసభ్యుడుగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు గెలుపొంది ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పక్షాన గెలిచి ఆ తర్వాత ఆయన టిఆర్ఎస్ లో చేరారు. కాగా ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫీటివిటీలో తన ఆస్తుల వివరాలను తప్పుగా చూపించారని అప్పట్లోనే తన సమీప ప్రత్యర్థిగా మిగిలిన టిఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు కోర్టులో పిటిషన్ వేశారు.
దానిపై సుదీర్ఘకాలం విచారించిన న్యాయస్థానం మంగళవారం సంచలనమైన తీర్పు ఇచ్చింది . పిటిషన్ లో వెంకట్రావు ఆరోపణలు రుజువు కావడంతో వనమాను అనర్హుడిగా ప్రకటించి, జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు కొత్తగూడెం శాసనసభ్యుడిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు స్థానంలో అనూహ్యంగా కోర్టు తీర్పుతో జలగం వెంకట్రావు ఇకనుంచి ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు.
ఈ పరిణామాల పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది..
…. ఈ కేసులో ఓడింది , గెలిచింది గులాబీ పార్టీ నే..
నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై టిఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటేశ్వరరావు పిటిషన్ వేశారు. వాస్తవంగా వీరిద్దరిలో వనమా వెంకటేశ్వరరావు పై కోర్టు అనర్హత వేటు వేస్తే కాంగ్రెస్ అభ్యర్థి ఓడినట్లు ,. కానీ కాంగ్రెస్ పక్షాన గెలిచి వనమా , ఆ తరువాత గులాబీ పార్టీలో చేరడంతో ఇప్పుడు ఆయన ఓడిన, గెలిచిన, ఆ గెలుపు టీఆర్ఎస్ దే. ఎందుకంటే మారిన రాజకీయ పరిణామాల్లో ఈ కేసులో ఇద్దరు ప్రత్యర్థులు ఒకే పార్టీలో ఉండటం ఓ విచిత్రం..
…. పార్టీకి జలగం ఇక దగ్గరవుతారా…?
గత కొంతకాలంగా జలగం వెంకట్రావు బి ఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని చర్చ ఉంది. ఒక విధంగా ఆయన పార్టీలో చురుకుగా లేరు. ఒక సందర్భంలో బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఆయన పొంగిలేటితో కలిసి కాంగ్రెస్ వైపు వచ్చే ఎన్నికల్లో అడుగులు వేస్తారని చర్చ కూడా జరిగింది.
ఇప్పుడు అనూహ్యంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కోర్టు తీర్పు ద్వారా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటినుంచైనా ఆయన పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తారా..? ఆయనకు టిఆర్ఎస్ అధినాయకత్వం తగిన ప్రాధాన్యత నిస్తుందా , లేదా అనే అంశంపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది . అదే సందర్భంలో వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థిగా జలగం వెంకట్రావు రంగంలో ఉండనున్నారు. ఈ తాజా పరిణామాలతో కొత్తగూడెం నియోజకవర్గంపై విఆర్ఎస్ పక్షాన సీటు కోసం ఆశపెట్టుకున్న వారికి ఆశాభంగం తప్పదనే వాదన వినిపిస్తుంది. కమ్యూనిస్టులతో పొత్తు కుదిరితే జలగం వెంకటరావుకి సైతం సీటు గండం తప్పదనే చేర్చ కూడా ఉంది.
