అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఖమ్మం పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తలు, నాయకుల కృషితో నేను సాధించబోయే విజయం చరిత్రలో నిలిచిపోవాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మంలోని బీఆర్ఎస్ భవన్లో కార్పొరేషన్లోని వివిధ డివిజన్ల స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

.బీఆర్ఎస్ గెలుపులో కార్యకర్తలదే ప్రధాన పాత్ర అన్నారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషిచేసి గెలుపు సాధించాలని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ సారధ్యంలో కేవలం పదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధిని సాధించుకున్నామని అన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన ఉచిత హామీలు, అమలు వీలుకాని వాగ్దానాలతో ప్రజలు నమ్మి నిలువునా మోసపోయారని అన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా దేశంలో మరెక్కడా లేని విధంగా అనేక బృహత్తర సంక్షేమ పథకాలు అమలుచేశామని నామ అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన పథకాలు అమలుచేసిన చరిత్ర ఒక్క కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రజలు కాంగ్రెస్ను నమ్మి మోసపోయామని కేవలం ఐదు నెలలల్లోనే గుర్తించారని అన్నారు. రైతులకు రైతుబంధు, రుణమాఫీ, మహిళలలకు రూ.2500లు, కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, తదితర పథకాలన్నీ నీరుగారి పోయాయని అన్నారు. కేసీఆర్ హయాంల రెప్పపాటు కూడా పోని కరెంట్ ప్రస్తుతం కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
కార్యక్రమానికి బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ తో పలువురు కార్పొరేటర్లు, బి.ఆర్. ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
