దిశా చైర్మన్ ఎంపీ నామ నాగేశ్వరరావు
ఖమ్మం, మే 25: ఖమ్మం జిల్లా ప్రజలకు ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా సమూల మార్పుతో పాపటపల్లి-మిర్యాలగూడ నూతన రైలు మార్గాన్ని అందరికి ఆమోదయోగ్యమైన రీతిలో నిర్మించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ చైర్మన్ నామా నాగేశ్వరరావు రైల్వే ఉన్నతాధికారులను కోరారు. గురువారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో దిశ కమిటీ సమావేశాన్ని చైర్మన్ నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ రహదారులు, పంచాయితీరాజ్, ఇర్రిగేషన్, విద్యుత్, మునిసిపల్, రైల్వే, డిఆర్డీఏ, వైద్య ఆరోగ్య, పరిశ్రమల శాఖలచే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై చైర్మన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలుత ప్రతిపాదించిన మిర్యాలగూడెం నూతన రైలు మార్గం అలైన్ మెంట్ వల్ల ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లోని 12 గ్రామ పంచాయితీలకు చెందిన ప్రజలు, చిన్న సన్నకారు రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లనుందని, ఇట్టి విషయమై 12 గ్రామాలకు చెందిన నాయకులు తనను కలిసి, సమస్యను వివరించి, గ్రామ పంచాయతీ తీర్మానం అందజేయగా, తాను కేంద్ర రైల్వే మంత్రికి, రైల్వే బోర్డు చైర్మన్, జనరల్ మేనేజర్లకు అందజేశానని అన్నారు. రైల్వే మంత్రితో స్వయంగా మాట్లాడిన ఫలితంగా, తొలుత ప్రతిపాదించిన అలైన్ మెంట్ మార్చేందుకు అంగీకరించారని అన్నారు .ఆయన అయితే మళ్ళీ సర్వే చేసి, సామాన్య ప్రజలకు, రైతులకు ఇబ్బంది లేకుండా కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఆయన వివరించారు. వీలుంటే ఖమ్మం జిల్లాతో సంబంధం లేకుండా రైలు మార్గాన్ని నిర్మించే యోచన చేయాలని ఆయన తెలిపారు. రైల్వే లో ప్రోటోకాల్ పాటించడం లేదని,సమాచారం ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
ఏ ఏ ప్రాజెక్టులు ఏ ఏ దశలో ఉన్నది, ఎప్పటికి పూర్తి అయ్యేది వివరాలు సమర్పించాలన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని, వారు అడిగే సమస్యలకు స్పందించాలని ఆయన తెలిపారు. జిల్లాలో చెక్ డ్యాం ల నిర్మాణం చేసుకున్నట్లు, రెండు పాంట్స్లు సమృద్ధిగా పండుతున్నట్లు ఆయన అన్నారు. అనధికార లే అవుట్లు, కాల్వల పూడ్చివేతపై చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రం తెలంగాణ నే అని ఆయన అన్నారు. ఇండ్లపై హై టెన్షన్ తీగలు, విద్యుత్ స్తంభాల తరలింపు, కావాల్సిన చోట విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్స్ ల షిఫ్టింగ్ తదితర సమస్యలు ఉన్నచోట వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. వైద్యం విషయంలో రాష్ట్రం గొప్ప ప్రగతిని సాధించింద అన్నారు. పల్లె, బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేసి, దేశంలో ఎక్కడా లేనివిధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది అన్నారు . అంధత్వ రహిత తెలంగాణ ఏర్పాటు కృషి చేస్తున్నామన్నారు.
క్రొత్తగా జిల్లాలో క్రొత్త రహదారులు, బైపాస్, రోడ్ సేఫ్టీ, నిర్వహణ ల కోసం రూ. 2,114 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఖమ్మం-కురవి జాతీయ రహదారి అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని, కేంద్ర మంత్రులకు లేఖలు వ్రాయడం వల్ల రూ. 124.80 కోట్లు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు . పరిశ్రమలు రావాలని, పరిశ్రమలతోనే అభివృద్ధి, ఉద్యోగాలు వస్తాయన్నారు .
ఖమ్మంలో సిఐఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు.
సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, వైద్య రంగంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందన్నారు. వైద్య శాఖకు సంబంధించి ఎలాంటి అవసరాలు ఉన్న ప్రజాప్రతినిధులు తన దృష్టికి తేవాలని ఎంపీ తెలిపారు. గోల్డ్ రిఫైనరీలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉండి, దేశంలో ఆదర్శంగా నిలిచిందన్నారు.
సమావేశంలో పాల్గొన్న జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్ మాట్లాడుతూ, జిల్లాలో మధిర నియోజకవర్గంలో రైల్వే లైన్ ఎక్కువగా ఉన్నట్లు, మధిర పట్టణంలో, పాతర్లపాడు, రాంపురం క్రాస్ రోడ్ మొదలగు చోట్ల ప్రజల సౌకర్యార్థం రైల్వే అండర్ బ్రిడ్జిలు అవసరం ఉన్నట్లు, ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాళ్లలో రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు
వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ, వైరా రిజర్వ్ నియోజకవర్గమని, దీని అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బ్రౌన్ పాఠశాల నుండి తనికెళ్ళ స్టేజి, పల్లిపాడు రహదారులు అభివృద్ధి పర్చాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అన్నారు.
సమావేశంలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, నాయుడు చౌరస్తా నుండి రాపర్తినగర్ వరకు, పొన్నెకల్ నుండి మద్దులపల్లి వరకు రోడ్డు విస్తరణ చేయాలని అన్నారు. మండల హెడ్ క్వార్టర్స్ లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. రైల్వే లైన్ ఏర్పాటులో రైతుల భూములు ప్రభావితం కాకుండా చూడాలన్నారు. కామంచికల్ దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టక, గేట్ మూసివేశారని, వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆసరా పెన్షన్లలో మరణించిన వారి స్థానే భార్యకు వెంటనే పెన్షను మంజూరు చేయాలన్నారు.
సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి మాట్లాడుతూ, గిరివికాసం పథకం క్రింద బోర్లు, విద్యుత్ లైన్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు లక్ష్యం మేరకు పూర్తి చేయాలని, అర్హులకు పథకాల లబ్ది చేకూరేలా అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు.
