వేదమంత్రాల మధ్య దైవసాక్షిగా ఏర్పడిన పవిత్ర వివాహ బంధాలు కొన్ని బలహీన పడుతున్నాయి.. భార్య భర్తలు ఒకరి కోసం ఒకరు ఎంతటి త్యాగానికైనా వెనక వెనకాడే వారు కాదు. కానీ కొందరు భార్యలు ఇటీవల కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేస్తున్నారు.. కొందరు భర్తలు భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి తమ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఇటువంటి వార్తలు రాష్ట్రంలో , దేశంలో ఇటీవల సర్వసాధారణంగా మారాయి. ఈ క్రూరత్వానికి కారణం సాంఘిక కట్టుబాట్లు సడలిపోవడమేనని కొందరు అంటున్నారు. ఇక మహిళలపై అత్యాచారాలు చేసి ఆపై హత్యలు చేసే దుర్మార్గాల వార్తలు తరచుగా చూస్తూనే ఉన్నాం.. ఈ అకృత్యాలు కులాలు, మతాలకు అతీతంగా జరుగుతున్నాయి. ఈ ఘటనలు పతనమైపోతున్న మానవతా విలువలు, సామాజిక కట్టుబాట్లకు నిదర్శనాలుగా సామాజికవేత్తలు అభివర్ణిస్తున్నారు..
…. మత రక్షణలు కాదు మానవతా విలువలను రక్షించాలి…
ప్రస్తుతం ప్రధాన మతాల రక్షణకు ఒక విధంగా దేశంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. స్వామి వివేకానంద చెప్పినట్లు మతాలకు ముంచుకొచ్చిన ప్రమాదం కంటే మానవతా విలువలు సామాజిక కట్టుబాట్లు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి. అవి పాతాళానికి వెళుతున్నందున మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతిని భార్యాభర్తలు సైతం ఒకరినొకరు హత్య చేసుకునే పరిస్థితికి చేరారు అనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఏ మత ధర్మమైన మానవతా విలువలను ఉత్తమ సమాజ నిర్మాణానికి అవసరమైన కట్టుబాట్లు బోధించాయి. అందుకే ప్రస్తుత తరుణంలో ఆయా మత బోధకులు, ధర్మ బోధకులు ప్రమాదం అంచున చేరిన మానవతా విలువలు, సామాజిక కట్టుబాట్లపై సమాజంలో విస్తృతంగా బోధించాల్సిన అవసరం ఉందని కొందరు అంటున్నారు. మానవతా విలువలపై సంబంధ బాంధవ్యాలపై విస్తృతంగా చర్చ జరగాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు మానవతా విలువలు కట్టుబాట్లపై ధర్మబద్ధమైన జీవనశైలి పై ప్రత్యేకంగా బోధించాలని కొందరు సామాజిక వేత్తలు కోరుకుంటున్నారు.
